ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
జగన్, ఆయన భార్య వై.భారతి, తల్లి వై.విజయమ్మ పేర్లలో ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల వివాదంపై ఎన్సీఎల్ఏటీ చెన్నై బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్ విజయమ్మకు చెందిన 99.75 శాతం వాటాను కొనసాగించాలని ఆదేశించింది. అయితే, వాటాల బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడరాదని ఇరు పక్షాలను ఆదేశించింది.
రిజిస్టర్లో సభ్యుల షేర్లను సవరించాలంటూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై కోర్టు ధిక్కరణ చర్యలేవీ చేపట్టబోమని జగన్, భారతి రెడ్డిల తరపు న్యాయవాది ఇచ్చిన హామీని రికార్డు చేసింది.
ఇటీవల హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ జగన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో కంపెనీ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని పేర్కొని, జగన్, భారతి, విజయమ్మ షేర్ హోల్డర్ హక్కులను పునరుద్ధరించాలని ఆదేశించింది.
ఈ తీర్పును సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ, వైఎస్ విజయమ్మ వేరువేరుగా సవాలు చేస్తూ, చెన్నైలోని ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించడం జరిగింది.
విచారణ చేపట్టిన చెన్నై ఎన్సీఎల్ఏటీ బెంచ్ “ప్రస్తుత స్థితిని కొనసాగించాలి” అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
“ఇరుపక్షాలు తదుపరి విచారణ వరకు తమ షేర్ హోల్డర్ హక్కులను వినియోగించకూడదు” అని ఎన్సీఏల్ఎటీ స్పష్టం చేసింది.
ఈ ఉత్తర్వుల కారణంగా, ప్రస్తుతం జగన్ కుటుంబానికి లభించిన షేరుహోల్డర్ హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.


పవన్ పేరుకు తగ్గట్టే గాలి మాటలు: అంబటి