తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. ఎప్పుడు చినుకు పడి వాతావరణం చల్లబడుతుందా..అని అందరూ ఎదురుచూస్తున్న కొద్దీ రుతుపవనాలు ఆలస్యం అవుతున్నాయి. ఒక పక్క ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అత్యధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వడగాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. దీంతో వర్షాలు పడాలంటూ పలు ప్రాంతాల్లో పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రుతుపవనాలు ఎల్లుండి అంటే జూన్ 22న రాష్ట్రంలో ప్రవేశించే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది.
19న అత్యధికంగా ఖమ్మంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండలో 42, రామగుండంలో 41.4, హన్మకొండలో 41, ఆదిలాబాద్లో 40.5, హైదరాబాద్లో 38.4 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 20వ తేదీ గురువారం, జూన్ 21వ తేదీ శుక్రవారం అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.