తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 32వ రోజుకు చేరింది. సీఎం కేసీఆర్ కార్మికులకు విధించిన డెడ్లైన్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విధుల్లోకి వెళ్తున్న భైంసా బస్ డిపో మేనేజర్ జనార్దన్పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. ఆయనపై ముసుగు వేసి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిని ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
డీఎంపై దాడితో మాకు సంబంధం లేదు : అశ్వత్థామరెడ్డి
భైంసా డిపో మేనేజర్పై దాడితో ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. అధికారిపై దాడిని ఆర్టీసీ జేఏసీ ఖండిస్తోందని పేర్కొన్నారు. గత 32 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సమ్మెలో భాగంగా నేడు అన్ని డిపోల వద్ద మానవహారాలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు నేడు అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు.