తమ వేతన బకాయిలు చెల్లించాలంటూ ఏపీలో ఆశా వర్కర్లు కొన్నివారాలుగా ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో భారీ స్థాయిలో ఆశా వర్కర్లు తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్ల వేతనాల విషయమై ఏపీ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పెంచిన జీతాలను సెప్టెంబరు నుంచి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఆశా వర్కర్లకు పూర్తిగా రూ.10 వేలు వేతనంగా ఇస్తామని చెప్పారు.
అంతేగాకుండా, ఆశా వర్కర్లు ఆందోళన పడుతున్నట్టుగా వారికి ఎలాంటి గ్రేడింగ్ ఉండదని, పాయింట్ల వ్యవస్థ తీసుకురావడంలేదని హామీ ఇచ్చారు. ఆశా వర్కర్ల పాత బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆశా వర్కర్ల హామీలను అమల్లోకి తీసుకువచ్చాని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేయని పనిని సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని వివరించారు. అది చూసి ఓర్వలేక విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

