దసరా ముందు సామాన్యుడిపై బండ భారం మోపారు.. గ్యాస్ సిలిండర్ ధర మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచేశారు. ఓవైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ వంట గ్యాస్ సిలిండర్ ధరపై చమురు సంస్థలు మంట పెట్టారు. 14.2కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.900కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇటీవలే రూ.43.50 పెరిగింది. ఈ ధరలు శుక్రవారం నుంచే (అక్టోబర్ 1) అమల్లోకి వచ్చాయి. ఫలితంగా 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.1,736కి చేరింది. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్ ధర రూ.75 పెరగడం గమనార్హం.ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు పెరుగుతుండటం వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారు.
కాగా.. గత రెండు నెలల వ్యవధిలో వంటగ్యాస్ ధరను పెంచడం ఇది నాలుగో సారి. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ, 15వ తేదీన గ్యాస్ ధరలను చమురు సంస్థలు సమీక్షిస్తాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి..
దిల్లీ – పెట్రోల్ రూ.102.94, డీజిల్ రూ.91.42, గ్యాస్ రూ.899.50
ముంబయి – పెట్రోల్ రూ.108.96, డీజిల్ రూ.99.17, గ్యాస్ రూ.899.50
కోల్కతా – పెట్రోల్ రూ.103.65, డీజిల్ రూ.94.53, గ్యాస్ రూ.926.00
చెన్నై – పెట్రోల్ రూ.100.49, డీజిల్ రూ.95.93, గ్యాస్ రూ.915.50
హైదరాబాద్ – పెట్రోల్ రూ.107.09, డీజిల్ రూ.99.75, గ్యాస్ రూ.952.00