ప్రముఖ సీనియర్ నటుడు అరవింద్ త్రివేది తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్లో 80వ దశకంలో ప్రదర్శితమైన అపురూప దృశ్య కావ్యం రామాయణ్ ధారావాహికలో రావణుడి పాత్ర పోషించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న త్రివేది మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన బంధువులు వెల్లడించారు.
ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్ టీవీ, సినీ నటీనటుల సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 82 ఏళ్ల అరవింద్ త్రివేది రావణుడి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేశారు.
1980లో వచ్చిన ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అపురూప దృశ్య కావ్యానికి ఉన్న క్రేజ్ను బట్టి ఇటీవల ఫస్ట్ లాక్డౌన్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు దూరదర్శన్ ‘రామాయణ్’ను పున:ప్రసారం చేసింది. 2020 ఏప్రిల్ 16న తిరిగి ప్రసారమైన రామయణ్ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా ఈ సీరియల్కు అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం.
300కిపైగా హిందీ, గుజరాతీ చిత్రాల్లో నటించిన త్రివేది .. 40 ఏళ్ల పాటు సినిమా రంగంలో ఉన్నారు. ప్రముఖ టీవీ షో విక్రమ్ అండ్ బేటల్లో తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన పలు పలు పౌరాణిక చిత్రాల్లో నటించారు. 1991 నుంచి 1996 వరకు గుజరాత్లోని సబర్కథ నియోజకవర్గం నుంచి భాజపా పార్లమెంటు సభ్యుడిగా త్రివేది పనిచేశారు.