ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం అంటూ.. మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకుందని దుయ్యబట్టారు.
నాడు ప్రగతి బాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
“నాడు కేసీఆర్ పాలనలో పల్లె, పల్లెకు ప్రగతి రథచక్రాలు. ప్రతి చేనుకు నీళ్లు.. ప్రతి చేతికి పని. ఇంటింటికి తాగునీళ్లు.. ఆడబిడ్డలకు తప్పిన ఇబ్బందులు.
నాడు ప్రగతిబాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని నిందలు. నేడు పల్లె, పల్లెలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునే కుట్ర.
అన్ని రంగాలలో తెలంగాణ ప్రగతిని దెబ్బతీసి .. ఇప్పుడు తీరిగ్గా ఆదాయం కోసం మద్యం అమ్మకాలను నమ్ముకున్న అసమర్థ కాంగ్రెస్ సర్కార్.
ఏడాది క్రితం సగటున ఒక వ్యక్తి మద్యం కోసం చేసే ఖర్చు రూ.897. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సగటున ఒక వ్యక్తి మద్యం మీద చేస్తున్న ఖర్చు రూ.1623కు పెరిగింది. లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచి, ధరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయం.
నాడు మద్యం అమ్మకాలపై విమర్శలు, నేడు అధికారం దక్కించుకుని ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకున్న కాంగ్రెస్ సర్కార్.
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం. పాలన గాలికి.. ప్రగతి కాటికి” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.