telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జి.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

జి.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంటగది, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణను పరిశీలించారు ఎమ్మెల్యే. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు.

‘రోజూ భోజనం బాగుంటుందా? కడుపునిండా మెనూ ప్రకారం అన్నం పెడుతున్నారా?’ అని విద్యార్థులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రతిరోజూ భోజనం బాగానే ఉంటుందని విద్యార్థులు సమాధానం ఇచ్చారు.

ఎమ్మెల్యే భోజనం రుచి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వంట నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఇకపై పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని వంట నిర్వాహకులు తెలిపారు.

పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన ఆహారం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

భోజనశాల, క్రీడా మైదానం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. క్రీడా సామాగ్రి, ఆట వస్తువులను ఆయన పరిశీలించారు. పాఠశాల ఆవరణతో పాటు మొత్తం ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Related posts