కలియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తి చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఈరోజు(మంగళవారం) శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ క్రమంలో ఉదయం 11 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు.
వేకువజామున స్వామివారి శుప్రభాతం, అర్చన సేవలు అనంతరం శ్రీవారి మూలవీరాట్టును నూతన వస్త్రాలతో కప్పి వేశారు. సుగంద ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో గర్భాలయం మొదలుకొని ఆలయ ప్రాకార గోడల వరకు అర్చకులు అధికారులు, సిబ్బంది శుద్ధి చేశారు. ఆలయ శుద్ధి తరువాత స్వామివారికి కప్పి ఉంచిన వస్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 22వ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
ఏకాదశి, ద్వాదశి ఈ రెండు రోజులే వైకుంఠ ద్వారం తెరిచి ఉండటం వల్ల ఎక్కువ మందికి ఉత్తర ద్వార దర్శనం లభించడంలేదు. అందుకే టీడీడీ వైకుంఠద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు.