వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో మరి కాసేపట్లో తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి కోర్టు.
నిర్మల్లోని నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో పదేళ్ల క్రితం అంటే 2012 డిసెంబరులో మజ్లిస్ పార్టీ ఓ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరితంచేసిన వ్యాఖ్యలు అత్యంత దుమారం రేపాయి.
‘‘మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే మాత్రమే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం..’’ అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై పోలీసులే సుమోటోగా తీసుకొని 188 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన అక్బరుద్దీన్ అప్పట్లో 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చారు.
అప్పటి నుంచి పదేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ వ్యవహారంలో ఇప్పుడు ఎట్టకేలకు నాంపల్లి కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఆ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. నిజానికి ఈ తీర్పును నిన్ననే (ఏప్రిల్ 12) ఇవ్వాల్సి ఉండగా నాంపల్లి కోర్టు నేటికి వాయిదా వేసింది.
ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో అప్రమత్తం అయిన హైదరాబాద్ పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓల్డ్ సిటీలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ ఏరియాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు..ఎలాంటి తీర్పు వెలువడిన శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతున్నారు.

