telugu navyamedia
క్రీడలు

హైదరాబాద్ గల్లీలో .. సన్ రైజర్స్ సందడి..

హైదరాబాద్‌ గల్లీలో ఈ సీజన్ ఐపీఎల్ సన్‌ రైజర్స్‌ ఆటగాళ్లు విజయ్‌శంకర్‌, రషీద్‌ ఖాన్‌ సందడి చేశారు. గల్లీల్లో తిరుగుతూ పిల్లలతో క్రికెట్‌ ఆడారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఓ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు.. అక్కడ ఆడుతున్న పిల్లలతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. పిల్లలకు క్రికెట్‌ మెలకువలు నేర్పించడంతో పాటు బౌలింగ్‌ కూడా చేశారు. 
రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో విజయ్‌శంకర్‌ బ్యాటింగ్‌ చేశాడు. ‘నేను ఫాస్ట్‌ బౌలింగ్‌ వేస్తా నువ్వు ఆడగలవా అంటూ రషీద్‌ఖాన్‌ సవాల్‌ విసరగా.. విజయ్‌శంకర్‌ ఆ సవాల్‌ను స్వీకరించి ఖాన్‌ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టాడు. అనంతరం వారు మాట్లాడుతూ ‘చాలామంది క్రికెట్‌ కెరీర్‌ గల్లీలోనే మొదలవుతుంది. మేం కూడా చిన్నవయసులో గల్లీ క్రికెట్‌ ఆడాం. మళ్లీ పిల్లలతో కలిసి ఇప్పుడిలా క్రికెట్‌ ఆడటంతో మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండి పోతుంది’ అని అన్నారు. 
అక్కడున్న పిల్లలు విజయ్‌, రషీద్‌కు ప్లకార్డులతో ఘనస్వాగతం పలికారు. ఇద్దరు ఆటగాళ్లు ఆఖర్లో పిల్లలతో సెల్ఫీలు దిగారు. ఈ ఇద్దరు రానున్న ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.

Related posts