బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చేసిన అభ్యర్థన అందిందని, దానిని పరిశీలిస్తున్నామని భారత్ బుధవారం అధికారికంగా వెల్లడించింది.
బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు, ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్య స్థాపనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
గతేడాది విద్యార్థుల నేతృత్వంలో జరిగిన నిరసనలను అణచివేసినందుకు గానూ ‘మానవతా వ్యతిరేక నేరాల’ కింద ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ ఇటీవల 78 ఏళ్ల షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఆమెతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్కు కూడా ఇదే అభియోగాలపై మరణశిక్ష పడింది.
గతేడాది ఆగస్టు 5న భారీ ఆందోళనల నడుమ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హసీనా, అప్పటి నుంచి భారత్లోనే నివసిస్తున్నారు.
ఈ తీర్పు నేపథ్యంలో హసీనాను తమకు అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్కు లేఖ రాసింది.
దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ “ఈ అభ్యర్థనను ప్రస్తుత న్యాయ, అంతర్గత చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలిస్తున్నాం” అని తెలిపారు.
రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను వెంటనే అప్పగించడం భారత్ విధి అని బంగ్లాదేశ్ పేర్కొంది.
అయితే ఈ తీర్పును షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. “ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీలుబొమ్మ ట్రైబ్యునల్ ఈ తీర్పు ఇచ్చింది” అని ఆమె ఆరోపించారు.
బంగ్లాదేశ్లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని భారత్ పేర్కొంది.

