కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాపాతంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, మీ సేవా కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో చాలా మంది విద్యార్థులకు వివిధ ఎంట్రెన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరో అవకాశం ఇచ్చింది.
మే 19 నుంచి 24 వరకు జేఈఈ మెయిన్ దరఖాస్తులకు అవకాశం కల్పించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిందని, మే 24 లోపు అభ్యర్థులందరూ తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా జేఈఈ అప్లికేషన్స్ విండోను మే 19న ఓపెన్ చేశారని, మే 24న తిరిగి క్లోజ్ చేస్తారని మంత్రి వెల్లడించారు.