telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతిపక్షనేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీకి హాజరుకాను: వై ఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలను, తప్పుడు పనులను సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని, అప్పుడే తనకు తగినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్‌కు ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.

“అసెంబ్లీలో ఉన్నది ఒక్కటే ప్రతిపక్షం, అది వైసీపీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే. మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా అని మీరు స్పీకర్‌ను ప్రశ్నించాలి” అని జగన్ అన్నారు.

అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు “పని చేయకపోతే జీతం లేదు” (నో వర్క్, నో పే) విధానం అమలు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిన్న లక్నోలో జరిగిన సదస్సులో సూచించిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు 2024 నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే.

భూముల సమగ్ర రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ‘భూ రక్ష’, ‘భూ హక్కు’ పథకాలను చంద్రబాబు హైజాక్ చేశారని, ఈ బృహత్కార్యంలో ఆయన పాత్ర ఏమాత్రం లేకపోయినా ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని జగన్ ఆరోపించారు.

Related posts