తెలంగాణ లో ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన మీడియాతో చిట్చాట్లో భాగంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆనాడు పార్టీ మారానని, సంగారెడ్డికి ఐఐటీ, ఎడ్యుకేషన్ సంస్థలు రావడంతో అభివృద్ధి చెందిందని జగ్గారెడ్డి చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసమే తన నిర్ణయాలుంటాయని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
అప్పుడు వైఎస్ పిలిస్తేనే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లానని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ను వీడాలని లేదని జగ్గారెడ్డి చెబుతున్నప్పటికీ ఆ పార్టీలో ఆయన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీలోకి రావాలని ఇప్పుడు తనను ఎవరూ ఆహ్వానించలేదని ఆయన చెప్పారు.