‘కేసీఆర్ తనను తాను ఓ చక్రవర్తిలా, రాజులా భావిస్తుంటాడు ఒక్కసారి ఎవరిపైనైనా ఆయనకు నెగెటివ్ అభిప్రాయం పడితే ఇక అంతే.
అది ఎన్నటికీ మారదు. కేసీఆర్ తో కవిత బంధం ఇక అతికే అవకాశమే లేదు’ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కు ఎదురుచెప్పే వారు ఆ తర్వాత ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరని వివరించారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దాదాపు 20 సంవత్సరాలుగా కేసీఆర్ వెన్నంటే ఉన్నానని, ఆయనను చాలా దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఈటల పేర్కొన్నారు.
రాచరికపు పోకడ, నియంతృత్వం, నమ్ముకున్న వారిని నట్టేట ముంచే పద్ధతి, వ్యక్తులను వాడుకుని వదిలేసే నైజం ఫలితమే రాజకీయంగా కేసీఆర్ ను బొందపెట్టిందని ఈటల రాజేందర్ చెప్పారు.
కవితకు వాళ్ల కుటుంబానికి మధ్య ఎక్కడో ఏదో తేడా వచ్చిందని ఇక అతికే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఎవరినైనా టార్గెట్ చేస్తే మరో పని పెట్టుకోడని, తను టార్గెట్ చేసిన వ్యక్తి అంతుచూసేదాకా వదలడని ఈటల చెప్పారు.

