పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. భారత ఆర్మీ హైఅలర్ట్ ప్రకటించింది. భారత జవాన్లపై ఆత్మహుతి దాడి చేసిన ఘటనపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ భారీ సంఖ్యలో తన సైన్యాన్ని కాశ్మీర్ కు తరలిచింది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ లకు చెందిన 100 కంపెనీ పారామిలటరీ బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు.
కేంద్ర హోంశాఖ ‘అత్యవసర’ నోటీసులు జారీ చేసింది. వేర్పాటు వాదనేతలు ప్రజలను రెచ్చగొడుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న యాసిన్ మాలిక్తో మొదలైన అరెస్టులు పలువురు జమాత్ ఇ ఇస్లాం నేతల అరెస్టుల వరకు కొనసాగాయి. కీలక నేత అబ్దుల్ హమీద్ ఫయాజ్ను కూడా నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్ సరిహద్దుల్లోని 27 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రత్యేక శిబిరాలకు తరలిరావాలని సైనికాధికారులు నోటీసులు జారీ చేశారు. సరిహద్దుల్లో కాల్పులు జరిగే అవకాశమున్నందున నిత్యావసర వస్తువులు తీసుకొని గ్రామస్థులు శిబిరాలకు తరలిరావాలని అధికారులు తెలిపారు.