ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే, వారి కుటుంబంలో ఒకరికి ఉపాధ్యాయ ఉద్యోగంతోపాటు ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్టు తెలిపింది. బాధితురాలి తండ్రితో నిన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
యూపీలో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నలుగురు వ్యక్తులు ఆమెను దారుణంగా హింసించారు. ఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుకను తెగ్గోశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న మృతి చెందిన విషయం తెలిసిందే.