విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో విద్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య హక్కుచట్టాన్ని రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతను ,పెంచేందుకు అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వివరించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్తాయిలో అభివృద్ది చేస్తామన్నారు.
విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు, పాఠ్య పుస్తకాలు సకాలంలో అందిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధన ప్రవేశపెడతామన్నారు. తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశాలు ఇస్తామని జగన్ చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించే విధంగా చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.