telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విజయవాడ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. వీకెండ్‌లో ఉచిత బ‌స్సులు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తులకు పోటెత్తుతున్నారు. వేస‌వి సెల‌వులు కావ‌డంతో అక్క‌డ ర‌ద్దీ నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా, దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోనేందుకు వీకెండ్‌లో బస్సులు ఏర్పాటు చేస్తోంది.

ఈ బ‌స్సుల్ని శుక్ర, శని, ఆదివారాల్లో ఉచితంగా నడపాలని ఆల‌య అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.

గతవారం రోజుల్లో క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స‌మ్మ‌ర్ హాలీడేస్, వీకెండ్ నేప‌థ్యంలో ఈ ర‌ద్దీ ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు.

అయితే, అమ్మ‌వారికి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులకు ఎటువంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ప‌లు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇంద్రకీలాద్రిపైకి వచ్చే భక్తుల కోసం దేవస్థానానికి చెందిన బస్సులు మొత్తం 12 ఉన్నాయి. అయితే అందులో 8 బస్సులను కేవ‌లం భక్తులకోసం ఉచితంగా ఆలయానికి చేరవేసేలా అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక‌, వీటి పార్కింగ్ ప్ర‌దేశాల కోసం అధికారులు ప‌రిశీలిస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటుగా పున్నమిఘాట్‌, వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న పార్కింగ్‌ ప్రదేశాలను అధికారులు ప‌రిశీలించ‌డం జ‌రిగింది.

భ‌క్తులు కొండ‌పైకి అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం వెళ్లేందుకు పున్న‌మిఘాట్ నుంచి రెండు బ‌స్సులను న‌డ‌పాల‌ని అధికారులు ఆలోచిస్తున్నారు.

వీటితోపాటు భ‌క్తుల సౌక‌ర్యార్థం మోడ‌ల్ గెస్ట్ హోస్ నుంచి నాలుగు బ‌స్సులు, వీఎంసీ ఎదురు పార్కింగ్‌ వద్ద నుంచి రెండు బస్సులు ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు.

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిత్యం దేవ‌స్థానం సిబ్బందితో పాటు పోలీసులు కూడా అందుబాటులో ఉండ‌నున్నారు.

ఈక్రమంలో వాహనాల రద్దీని బట్టి కొండపైకి పరిమిత సంఖ్యలో వాహనాలను అనమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొండపైన ఓం టర్నింగ్‌ వద్ద పార్కింగ్‌ ప్రాంతంలో 150 కార్లు, బైకులకు మాత్రమే స్థలం ఉంది. అందుకే వాహనాలను కిందే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related posts