ఇండియా, చైనాలు వర్ధమాన దేశాలు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్, చైనాలు పెద్ద దేశాల నుంచి లాభాలను పొందుతున్నాయని, ఇకపై అలా సాగనివ్వబోమని పేర్కొన్నారు. ఇండియా అభివృద్ధి చెందిన దేశమేనని, అభివృద్ధి చెందుతున్న దేశమన్న ముసుగులో తమను మోసం చేయలేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆసియాలో ఈ రెండు దేశాలూ ఆర్థిక దిగ్గజాలుగా మారాయని, ఇకపై వాటికి వర్ధమాన దేశాలన్న ట్యాగ్ ఉండబోదని స్పష్టం చేశారు.
ఇండియా, చైనాలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఎన్నో ఏళ్లుగా అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దగ్గర చేస్తూ వచ్చిందన్నారు. కానీ, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ట్యాగ్ తో అవి అమెరికాను నష్టపరుస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్క అమెరికా తప్ప అన్ని దేశాలూ ఎదుగుతున్నాయని అన్నారు. వర్ధమాన దేశాల హోదాను వాడుకుంటూ, అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్న దేశాలను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.

