లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. అక్టోబరు 3న ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు తన కారుతో రైతులను తొక్కించడంతో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటనపై.. ఏఐసీసీ దేశవ్యాప్త మౌన దీక్ష నిరసనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. నిరసన చేపట్టారు.
ఈ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ నేతలు మహేశ్వర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ తదితరులు పాల్గొన్నారు.