telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ సతీష్‌చంద్ర గారిచేత రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్‌ 16న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. అందులో భాగంగా తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌చంద్ర శర్మ నియామకం జరిగింది.

జస్టిస్‌ సతీష్‌ చంద్ర.. 1961 నవంబర్‌ 30న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్‌.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా యూనివర్సిటీ వీసీగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్‌పూర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్‌ హరిసింగ్‌గౌర్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. అదే యూవర్సిటీలో న్యాయ పట్టా అందుకొని 1984, సెప్టెంబర్‌ 1న మధ్యప్రదేశ్‌ బార్‌లో న్యాయవాదిగా చేరారు.

ఎల్‌ఎల్‌బీలోనూ మూడు గోల్డ్ మెడల్స్‌ అందుకున్నారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్‌ విషయాల్లో ప్రాక్టీస్‌ చేశారు. 1993లో అడిషనల్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. ఇక, 2004లో సీనియర్‌ ప్యానెల్‌ కౌన్సెల్‌గా పదోన్నతి పొందిన ఆయన.. 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు.

2008, జనవరి 18న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సతీష్‌ చంద్ర.. 2010, జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై.. ప్రమాణస్వీకారం చేశారు.

Related posts