సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా ఉంది. ఇవాళ నాలుగో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.
అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని సమావేశంలో చంద్రబాబు వివరించారు.
తమ సంస్థ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా) ప్రతినిధులు చెప్పారు.
వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్సిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్ లేతో చంద్రబాబు చర్చించారు.
రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సముఖుత వ్యక్తం చేశారు.
పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్ కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్-ఎస్ఎంబీసీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
వివిధ ప్రాజెక్టుల్లో అవసరమైన ఆర్థిక భాగస్వామ్యంపై ఎస్ఎంబీసీ ప్రతినిధితో చంద్రబాబు మాట్లాడారు.
ఇందులో భాగంగా ఫైనాన్స్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాలపై తాము ఆసక్తితో ఉన్నామని చంద్రబాబుకు ఎస్ఎంబీసీ ప్రతినిధి రాజీవ్ కన్నన్ వివరించారు.
అలాగే గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై టెమసెక్ హెల్డింగ్స్ ప్రతినిధి దినేశ్ ఖన్నాతో సీఎం చర్చించారు.
దాంతో వివిధ రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని దినేశ్ ఖన్నా తెలిపారు. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై ఎంఓయూలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని దినేశ్ ఖన్నా హామీ ఇచ్చారు.