దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు.
ఈరోజు (శనివారం) ప్రగతి మైదానం భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఇరువురు సీఎంలు హాజరుకానున్నారు.
సాయంత్రం 4 గంటల వరకు నీతి ఆయోగ్ సమావేశం జరుగనుంది.
ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను తెలంగాణ సీఎం రేవంత్ ఆవిష్కరించనుండగా దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా పెంపుదల తదితర అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
2018 తర్వాత తొలిసారిగా నీతిఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరుకాబోతున్నారు.
ఈ సందర్భంగా నీతిఆయోగ్ పాలక మండలి భేటీలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను సీఎం ఆవిష్కరించనున్నారు.
2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదల్చుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదికను సీఎం రేవంత్ సమర్పించనున్నారు.
తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడం లక్ష్యంగా పెట్టకున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పనున్నారు.
ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్తో పాటు ఆ రంగాల్లో మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలంగాణ సీఎం వివరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
అదే తరహాలో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాల తగ్గింపు, జనాభా పెంపుదలపై, నదుల అనుసంధానం నీటి వినియోగంపై ఈ సమావేశంలో సీఎం ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఒక్కో సీఎంకు 7 నిముషాలు సమయాని నీతి ఆయోగ్ కేటాయించింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ ప్రారంభానికి ముందు సీఎంలు, గవర్నర్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించనున్నారు.


తెలంగాణలో దళితులకు రక్షణ లేదు: మందకృష్ణ