telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు

శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు, సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డను తాకాయి.

ఈ చారిత్రక సందర్భానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి సంప్రదాయ పంచెకట్టులో హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణా జలాలకు పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం కృష్ణమ్మకు హారతి ఇచ్చి, రాష్ట్ర ప్రజలకు జలసిరులు అందించాలని ప్రార్థించారు. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ పనులు పూర్తికావడంతో, కుప్పం నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందడంపై స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ చారిత్రక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలు ‘జై చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంతో కుప్పం ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

Related posts