telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ భారీ వ్యూహరచన చేస్తోంది

తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగానే జాతీయ స్థాయి అగ్రనేతలను రంగంలోకి దింపి, ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించింది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్రానికి రావాలని ఇప్పటికే ఆహ్వానం పంపారు

వారి రాకతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా, ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

అత్యంత కీలకమైన పర్యటనగా భావిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభను ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్ జిల్లాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ అగ్రనేతల పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు రూట్ మ్యాప్‌పై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలుకొని మారుమూల మున్సిపాలిటీల వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఇప్పటికే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ, జాతీయ నేతల రాకతో ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించనుంది.

ఈ పర్యటనలు విజయవంతమైతే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Related posts