గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు తో కలిసి సందర్శించారు.
ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలించారు.
డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి అంశాల గురించి బిల్ గేట్స్ కు చంద్రబాబు వివరించారు.
ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ డేటా లేక్ ద్వారా అన్ని శాఖలను అనుసంధానం చేయడం, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం చాలా బాగుందని ప్రశంసించారు.
అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్ సమాచారం సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను అంచనా వేస్తున్న విధానం కూడా గేట్స్ను ఆకట్టుకున్నాయి.
ఆర్టీజీఎస్ లోని డిస్ ప్లే వాల్స్ పై ప్రెజెంటేషన్లను ఆయన పరిశీలించారు.
ప్రాపర్టీ రికార్డుల భద్రత కోసం బ్లాక్చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి విధానాలు అమలు చేస్తున్న తీరును గేట్స్ ప్రశంసించారు.
సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు సేకరించి ప్రజలకు సలహాలు ఇస్తున్న విధానాన్ని “గ్రేట్” అని కొనియాడారు.
అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్ లో సమాచారాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలను తీసుకుంటున్నట్టు బిల్ గేట్స్ కు చంద్రబాబు తెలిపారు.
ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రికార్డులను భద్రపరుస్తున్నామని, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఆయనకు వివరించారు.
అమరావతి నిర్మాణ వివరాలను కూడా ఆసక్తిగా తెలుసుకున్న బిల్ గేట్స్ “గ్రేట్ వర్క్” అంటూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

