జగన్ ప్రభుత్వం నేడు తొలిబడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ లో నవరత్నాలు అమలు చేయడమే ప్రధాన అజెండాగాతోస్తుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. హంగులూ, ఆర్భాటాలకు తావులేకుండా చూసుకోవాలని జగన్ సర్కార్ భావిస్తోంది. మరి తొలి పద్దులో ఏయే అంశాలుంటాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్ ప్రజల ముందుకు రానుంది. దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి శాసనసభలో..పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ సారి బడ్జెట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలకు..సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అదే సమయంల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్లో పన్నుల వాటాను పరిగణలోకి తీసుకొని ఏపీ బడ్జెట్కు తుది రూపం ఇచ్చారు. నవరత్నాలు అమలు చేయడమే అజెండాగా ఉండే బడ్జెట్లో ఏయే పథకానికి ఎన్ని కేటాయింపులు చేస్తారో ఇవాళ తేలిపోనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2.26 లక్షల కోట్లు ఉంది. అయితే.. ఇప్పటికే రాష్ట్ర అర్దిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం 60 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఉన్నట్లు ప్రకటించింది. దీంతో..వాస్తవంగా ఉన్న ఆర్థిక పరిస్థితి ఆధారంగానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. హంగులు, ఆర్భాటాలకు మా ప్రభుత్వంలో చోటు లేదని ఆర్థిక మంత్రి బుగ్గన ఇప్పటికే చెప్పేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చనే సంకేతాలు ముందుగానే పంపారు.