మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అంటూ అంబటి విసిరిన సవాల్పై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రాజెక్టును పూర్తి చేయకుండా చేతులెత్తేసిన వ్యక్తి ఇప్పుడు చర్చకు పిలవడం సిగ్గుచేటని విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. “జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ అంబటికి పోలవరం ప్రాజెక్టుపై కనీస అవగాహన కూడా లేదు.
మా పార్టీలోని సాధారణ కార్యకర్తలకు ఉన్న పరిజ్ఞానం కూడా ఆయనకు కొరవడింది” అని వ్యాఖ్యానించారు.
గత వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
“ఆనాడు వారు చేసిన పాపం వల్ల ఈరోజు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఈ నష్టానికి వారే పూర్తి బాధ్యత వహించాలి” అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే వైసీపీ నేతలు నిరాధారమైన సవాళ్లు విసురుతున్నారని ఆయన విమర్శించారు.


ఇసుక కొరతను నివారించడంలో ప్రభుత్వం విఫలం: కన్నా