ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ను విడుదల చేశారు.
2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ ప్రకటించారు.
ఇటీవల అమరావతిలో జరిగిన రెండు రోజుల గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో చర్చించిన అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిక్లరేషన్ ప్రకటించింది.
అమరావతిలో జరిగిన సమ్మిట్లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. 7 సెషన్స్గా జరిగిన ఈ సమ్మిట్లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండిలు పాల్గొన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి ప్రయోగాలు, సాంకేతికత, పెట్టుబడులపై చర్చలు సాగాయి.
భారత్లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్కు విధివిధానాలు రూపొందించేలా ఈ డిక్లరేషన్ ప్రకటించారు.
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యం చేసుకుంది.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను రాష్ట్రంలో నెలకొల్పటమే డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.
2027 నాటికి 2 గిగావాట్లు, 2029కి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ లక్ష్యంగా చేసుకున్నారు. 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని, కిలో హైడ్రోజన్ గ్యాస్ రూ. 460 నుంచి రూ.160కి తగ్గించేలా కార్యాచరణ రూపొందించారు.
2029 నాటికి 25 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పంపిణీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేశారు.
గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పరిశోధనల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అలాగే ఈ రంగంలో ముందడుగు వేసే 50 స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు డిక్లరేషన్లో పేర్కొన్నారు.
ఈ డిక్లరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ మ్యాప్పై ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది దేశవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్కు దారితీసే మోడల్ స్టేట్గా ఏపీని నిలిపేందుకు బలమైన అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు: ఉత్తమ్