కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది.
అక్షయపాత్ర పౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిసి నవంబర్ 14వ తేదీన కొడంగల్ లో నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ కిచెన్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు వీలుగా కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో అక్షయపాత్ర ఫౌండేషన్ గ్రీన్ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. నాణ్యమైన భోజనం తయారు చేసి అందించేందుకు అక్షయ ఫౌండేషన్ దాదాపు రూ.25 వరకు ఖర్చు పెడుతుంది.
ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును అక్షయ పాత్ర ఫౌండేషన్ భరిస్తుంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధుల సాయంతో ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతుంది.
312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం అందిస్తున్నారు.
అన్ని గ్రామాల్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి ఈ పథకానికి మంచి స్పందన వచ్చింది. ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.


కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక నాపై కేసులు: జగన్