కరోనా వైరస్ వృద్ధులపై అధికంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు తాజా సూచనలు చేశారు. మిగతా వారితో పోలిస్తే, 60 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు షుగర్, గుండె జబ్బులు, హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్నారు. దీంతో కనీసం మరో నెల రోజుల పాటు హై రిస్క్ జోన్ లో ఉన్నవారు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఇక ఏపీలో 60 ఏళ్లు దాటిన వారు 50 లక్షల మంది వరకూ ఉన్నారు. వీరంతా గడప దాటి బయటకు రావద్దని, వీరి సంక్షేమంపై కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి వైద్య నిపుణులు సూచించారు. వీలైతే, వృద్ధులను ప్రత్యేక గదిలో ఉంచాలని సూచించారు. వారు ఇప్పుడు వాడుతున్న మందులను కొనసాగించాలని సలహా ఇచ్చారు. కొందరు వైరస్ సోకకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వాడుతున్నారని, వాటిని వాడవద్దని తెలిపారు.

