వరంగల్ జిల్లా హన్మకొండలో చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా బీజేపీ ధర్నా చేపట్టింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు చేపట్టిన ధర్నాలో అపశృతి చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయబోయారు. ఈ క్రమంలో పక్కనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇదే సమయంలో దిష్టిబొమ్మకు నిప్పటించారు. అయితే ఆ మంటలు కాస్తా పలువురు బీజేపీ కార్యకర్తలకు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఇతర కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.