అర్జున అవార్డు గ్రహీత, విశాఖపట్నంకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.
కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సన్నద్ధమవుతున్న ఆమెకు రూ.30.35 లక్షల చెక్కును మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో అందజేశారు.
జ్యోతి తన కుటుంబ సభ్యులు, ‘శాప్’ ఛైర్మన్ రవినాయుడితో కలిసి మంత్రిని కలుసుకున్నారు.
ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన జ్యోతి కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు.
అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి ప్రతిష్టలను పెంచిన జ్యోతికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆమెను లోకేష్ ప్రోత్సహించారు.

