నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ను పరువు హత్య ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా,అటువంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అల్లుడిని మామ హత్య చేయించినట్లు తెలిసింది.
హైదరాబాద్లోని చందానగర్లో హేమంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తమ ప్రాంతానికి చెందిన అవంతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో హేమంత్ దంపతులు నివాసం ఉంటున్నారు.
నిన్న సాయంత్రం హేమంత్తో పాటు అతడి భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. ఈ క్రమంలో హేమంత్ భార్య కారులోంచి దూకేసి తప్పించుకుంది. అనంతరం హేమంత్ను మాత్రమే వారు తీసుకెళ్లి హత్య చేశారు. ఈ రోజు ఉదయం సంగారెడ్డిలో హేమంత్ విగతజీవిగా కనపడ్డాడు.
హేమంత్ అపహరణపై గత రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని యువతి తండ్రే హత్య చేయించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.