బాలీవుడ్ డ్రగ్స్ కేసు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు హీరోయిన్ల మేనేజర్లతో పాటు నటీమణుల పేర్లు కూడా వెలుగు చూశాయి. రియా చక్రవర్తితో పాటు పలువుర్ని ఎన్సీబీ అధికారులు విచారించగా ఈ షాకింగ్ విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే రకుల్ప్రీత్ సింగ్ పేరు బయటికి రాగా… తాజాగా మహేశ్ సతీమణి నమ్రత పేరు వెలుగులోకి రావడంతో మరింత కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో నటి దియా మీర్జా పేరు కూడా తెరపైకి వచ్చిన విషయం విదితమే. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీలర్స్ పోలీసు విచారణలో అంగీకరించినట్లు తెలియవచ్చింది. దియా మీర్జాకు త్వరలోనే సమన్లు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని జాతీయ, ప్రాంతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై దియా స్పందించారు. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని దియా తెలిపారు.