రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన ఛలో అమలాపురంకు ఎలాంటి అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్రావు స్పష్టం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతమైన కోనసీమలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
కరోనా నేపథ్యంలో కోనసీమలో 34, 144 సెక్షన్లు అమలులో ఉన్నాయని, ఎవరూ ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేసేందుకు అనుమతులు లేవని ఆయన అన్నారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని, అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.