కరోనా వ్యాక్సిన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిశోధనలకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వెనుక బిల్ గేట్స్ హస్తం ఉందంటూ కుట్ర సిద్ధాంతాలు (కాన్స్ పిరసీ థీరీస్) ప్రచారంలోకి వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ ద్వారా భూమిపై 15 శాతం ప్రజలను అంతమొందించాలన్నది ఆయన లక్ష్యమని ఓ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ ఘాటుగా స్పందించారు.
ప్రజలను వ్యాక్సిన్ల ద్వారా ఎప్పుడైనా చంపామా? అని బిల్ గేట్స్ ప్రశించారు. వ్యాక్సిన్ల ద్వారా మేం ఎప్పుడైనా డబ్బు కూడబెట్టామా? ఎవరైనా నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. వాస్తవానికి ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల కోసం ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని అన్నారు. వ్యాక్సిన్లతో ప్రజలను చంపాలని ఎప్పుడూ అనుకోలేదని తేల్చి చెప్పారు.