దేశంలో కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో రద్దీ ఉండే ప్రాంతాల్లోకి వెళ్లడానికి జనాలు వణికిపోతున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే న్యూఢిల్లీ నుంచి దిబ్రుగర్హ్ వెళ్తున్న రైల్లో ఓ ఇద్దరు విదేశస్తులు తీవ్రంగా దగ్గుతున్నారు.
దీంతో మిగతా ప్రయాణికులు అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషన్లో 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఆ ఇద్దరు విదేశస్తులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వీరికి కరోనా లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారు. సాధారణ దగ్గుగానే వైద్యులు తేల్చారు. విదేశస్తులకు కరోనా లేదని తేలడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.