రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ… “ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూలు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు.. దళిత కథలు సినిమాగా మారవు అంటారు.. కానీ పలాస లో వారి పాత్రలను హీరోలను చేసాము..వారి సమస్యలను చర్చించాము.. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీ సినిమాలు కూడా మీరు చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి..ఇది నా ఆవేదన. నా నలభై ఏళ్ల కెరియర్ లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు. కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం..కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే. పలాస సినిమా విడుదల తరువాత అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిన సినిమాల్లో పలాస ఒకటి. ఒక మంచి సినిమాలో భాగమయినందుకు సంతోషంగా ఉంది, మళ్లీ ఈ సినిమాను విడుదల రోజు థియేటర్ లో చూశాను, నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. దీనంతటికి కారణం దర్శకుడు కరుణ కుమార్, తను ప్రాణం పెట్టి ఈ సినిమా తీసాడు, తన కష్టం వృధా కాదని భావిస్తున్నాను. నా 40 ఏళ్ల కెరీర్ లో ఇంత బాగా ప్రతి డైలాగ్, సన్నివేశం నాకు గుర్తుండిపోయే సినిమా పలాస అయినందుకు సంతోషంగా ఉందన్నారు.