ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఎర్రబాలెంలో రైతులతో ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులను జగన్ మోసం చేశారని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటున్నామని చెప్పి, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పారని మండిపడ్డారు.అమరావతి రాజధానిగా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుందని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ స్పష్టం చేస్తే భూములు ఇచ్చే విషయంలో రాజధాని రైతులు ముందుకు వెళ్లేవారు కాదని అన్నారు.
అమరావతి రైతులకు అండగా ఉంటానని మాట ఇస్తున్నానని పవన్ అన్నారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ రాజధాని అని ఇప్పటికీ ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని అన్నారు. జగన్ ను 13 జిల్లాల ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, ఆయన మాత్రం కొన్ని జిల్లాలకే సీఎం అనే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.