ఓ పాఠశాల వార్షికోత్సవం లో పలువురు ప్రముఖులు..చిన్నారుల ప్రదర్శనలను తిలకిస్తూ ఉన్నారు. అందులో కొందరు చిన్నారులు ఓ స్కిట్ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ స్కిట్ దుమారం రేపుతోంది. 29 ఏళ్ల క్రితం జరిగిన అత్యంత వివాదాస్పదమైన, సున్నితమైన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను స్కిట్ రూపంలో ప్రదర్శించారు ఆ చిన్నారులు. అదికూడా సాక్షాత్తూ కేంద్రమంత్రి సదానందగౌడ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సమక్షంలోనే ఈ ప్రదర్శన జరిగింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పిఎఫ్ఐ కార్యకర్త, స్థానికుడు అబూబ్యాకర్ సిద్ధిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. భారతీయ శిక్షా స్మృతిలోని 295 ఎ, 298 ఎ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని కల్లడ్కలో ఉన్న శ్రీరామ విద్యాకేంద్ర ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో పలువురు విద్యార్థులు ఈ స్కిట్ను ప్రదర్శించారు. తెల్ల చొక్కాలు, కాషాయ రంగు ప్యాంట్లను ధరించి జై శ్రీరామ్, జై వీర హనుమాన్ నినాదాలు చేస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత స్కిట్ ను ప్రదర్శించారు. కల్లడ్క ప్రభాకర్ భట్ అనే పేరు మీద ఏర్పాటైన ట్రస్ట్.. శ్రీరామ విద్యాకేంద్ర పాఠశాలను నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ కు ఆర్ఎస్ఎస్ కర్ణాటక సంచాలక్ ద్వారా నిధులు అందుతున్నాయని అంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి.. విద్యార్థులు ప్రదర్శించిన ఈ స్కిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త డ్రామా: లోకేశ్ ఫైర్