తెలుగుదేశం పార్టీ చీలిక సమయంలో జరిగిన పరిణామాలపై మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అప్పటి విషయాలను గుర్తు చేశారు. . మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ..ఆరోజు నిబంధనలను అనుసరించే తాను ఎన్టీఆర్ ను బీఏసీ సమావేశానికి పిలవలేదనియనమల అన్నారు. లోపల జరిగిన పరిణామాలకు, బయటకు వచ్చిన వార్తలకు సంబంధంలేదన్నారు.నాడు ఎన్టీఆర్ తనను బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవలేదు అని అడిగారని యనమల చెప్పారు.
అయితే అప్పటికే చంద్రబాబును టీడీఎల్పీ లీడర్ గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని తెలిపారు. అందుకే చంద్రబాబును మాత్రమే బీఏసీకి పిలవడం జరిగిందని ఎన్టీఆర్ కు తాను వివరించినట్లు చెప్పారు. అయితే, సభలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ బీఏసీకి పిలవకపోవడం గురించే మాట్లాడతానని పట్టుబట్టారని తెలిపారు. నిబంధనల ప్రకారం ఆ అంశం మాట్లాడ కూడదని, అందుకే తాను అంగీకరించలేదని పేర్కొన్నారు. మిగిలిన విషయాల గురించి మాట్లాడవచ్చని ఎన్టీఆర్ కు చెప్పినప్పటికీ ఆయన సభ నుంచి బయటకు వెళ్లిపోయారని యనమల చెప్పారు.