సెల్ఫోన్ కొనివ్వలేదని ఆగ్రహించిన ఓ భార్య భర్తపై దాడికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక తారకరామానగర్కు చెందిన పర్ల నిత్యానందం, కుమారి ప్రియదర్శిని భార్యాభర్తలు. తనకు సెల్ఫోన్ కొనివ్వాలంటూ భార్య కుమారి గత కొంతకాలంగా భర్తను అడుగుతోంది. ఆమె అడిగిన ప్రతిసారీ తర్వాత కొనిస్తానని చెబుతూ భర్త రోజులు గడిపేస్తున్నాడు.
ఇదే విషయమై సోమవారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. తనకు ఫోన్ ఇవ్వాల్సిందేనని కేకలు వేసింది. ఈ కోపంలో ఏడాది వయసున్న కొడుకును కొట్టి ఏడిపించింది. దీంతో కొడుకును ఒళ్లోకి తీసుకునేందుకు భర్త ప్రయత్నించాడు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న కుమారి ఫ్యాన్ రాడ్డుతో భర్త తలపై దాడిచేసింది. దీంతో భర్త నిత్యానందం తలచిట్లి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.