చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి రూ.25.8 లక్షలను కాజేసిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులపై కేసు నమోదైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచురాపల్లిలో చోటుచేసుకుంది. వయలూర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ షేక్ మోహిద్దీన్, అసిస్టెంట్ మేనేజర్ చిన్నాదురై ఇరువురు కలిసి చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి నగదు కాజేశారు. ఎమిసోలా అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది.
కాగా ఈ ఖాతాను క్లెయిమ్ చేసుకోవడానికి ఇక ఎవరూ రారులే అనుకొని ఈ పనికి పూనుకున్నారు. సంతకాన్ని సృష్టించి, ఏటీఎం కార్డుతో నగదును విత్డ్రా చేశారు. ఆడిట్ సందర్భంగా సదరు ఖాతాలో కొన్ని సంవత్సరాలుగా నగదు జమ కావడం లేదని అధికారులు గుర్తించారు. విచారణ జరపగా సదరు ఖాతాదారు కొన్నేళ్ల క్రితమే చనిపోయినట్లుగా తెలిసింది. బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఇరువురు కలిసి చోరీకి పాల్పడ్డట్లుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.