తెలంగాణలోని హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి రంగం సిద్దమైంది. ఇందులో భాగంగా మద్యం, నగదు ప్రవాహం మొదలయ్యింది. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల నగదు, భారీగా మద్యం, 118 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 21న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు నగదు, మద్యం పంపిణీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 54 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.