ఇటీవల ఎంతో ఉత్కంఠగా జరిగిన “మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)” ఎన్నికల్లో శివాజీరాజా ప్యానెల్పై వీకే నరేశ్ ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మార్చి 11న “మా” నూతన కార్యవర్గం కొలువుదీరింది. అధ్యక్షుడిగా వీకే నరేశ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా జీవిత, ఉపాధ్యక్షులుగా హేమ, ఎస్వీ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా గౌతంరాజు, శివబాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల నియమితులయ్యారు. అయితే కొత్తకార్యవర్గం కొలువుదీరి ఆరు నెలలు ముగియగానే “మా”లో మనస్పర్థలు మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. ఇందుకు మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశం బలం చేకూర్చింది. అధ్యక్షుడు నరేశ్కి రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయం తెలిసిన ‘మా’ కార్యనిర్వాహక వర్గం ఈ వార్తలను ఖండించింది. “ఓ అసోసియేషన్ అంటే.. చాలా సమస్యలుంటాయి. వాటన్నింటినీపై అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ‘మా’ వెల్ఫేర్కి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి మంగళవారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియజేస్తాం” అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం తెలియజేసింది.