యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా యూవీ క్రియేషన్స్తో కలిసి దేశంలోని అతి పెద్ద మల్టీప్లెక్స్ని నిర్మించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న “వి ఎపిక్” అనే మల్టీప్లెక్స్ దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మితమైనట్టు సమాచారం. 7 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా ఈ మల్టీప్లెక్స్ని నిర్మించినట్టు తెలుస్తుంది. ప్రపంచంలో మూడవ అతిపెద్దది, ఆసియాలో అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ ను టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఈరోజు ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట పట్టణానికి సమీపంలోని పిండిపాళెంలో క్యూబ్ సినిమా సంస్థకు చెందిన ఎపిక్ స్క్రీన్ థియేటర్ ను రామ్ చరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రేపు విడుదల కానున్న ‘సాహో’, త్వరలో రిలీజ్ కానున్న ‘సైరా’ చిత్రాల విజువల్స్ ను ఈ స్క్రీన్ పై రామ్ చరణ్ వీక్షించాడు. గ్రాండ్ విజువల్స్ ను ఎపిక్ స్క్రీన్ పై చూడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ‘సైరా’ను ఈ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఎపిక్ స్క్రీన్ గురించి చెప్పాలంటే.. 100 అడుగుల వెడల్పు, 80 అడుగుల ఎత్తులో ఉంది. హై ఎండ్ లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ ఆడియో వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ థియేటర్లో 670 సీట్ల సామర్థ్యం ఉంది. 3డీ సౌండ్ సిస్టమ్ ఈ థియేటర్ ప్రత్యేకత. ఇప్పటి వరకు భారీ స్క్రీన్లు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఆ కోవలో ఇది మూడోదని, ఆసియాలో రెండోదని థియేటర్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇందులోనే ఒక్కోటి 180 సీట్ల సామర్థ్యంతో మరో రెండు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలియజేశారు. “వి ఎపిక్” లో మొదటగా ప్రభాస్ నటించిన “సాహో” చిత్రం ప్రదర్శితం కానుంది.
previous post
నెపోటిజం అంటూ సూర్య, విజయ్ పై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు…!