వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. స్వేచ్ఛగా చదువుకోవాల్సిన విద్యార్థులు తమ ఫీజుల కోసం, ఉపకారవేతనాల కోసం ధర్నాలకు, బంద్ లకు దిగాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి, వైఫల్యానికి ఇదొక నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ పాలకులు తమ భవిష్యత్తు బాగుకోసం చూసుకుంటున్నారే తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తప్పించుకుంటామంటే కుదరదని అన్నారు.విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.